విశాలా బజార్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ఉదయం 11 గంటలకు చేపడతారు.
లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలు.. తొట్టెలు పోతరాజుల ఊరేగింపుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం మధ్యాహ్నం రెండు గంటలకు ఊరేగింపుగా వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరకుంటాయి.
Also Read: రాబోయే 10 సంవత్సరాల పాటు ఈ రాశులపై శని దేవుడి చెడు దృష్టి
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ఏర్పాట్లు చేశారు. కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.