KCR take decession to give chance to Youth leaders in BRS
మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది బీఆర్ఎస్. ఇటీవల జోరుగా జరుగుతున్న వలసలు అధినేతకు తలనొప్పగా మారాయి. పార్టీలో ఎప్పుడు ఎవరు కండువా మార్చేసుకుంటారో తెలియని పరిస్థితి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో అధినేతకే అంతుపట్టని రహస్యంగా ఉంది. చేరేవాళ్లు కనీసం లీకులు కూడా ఇవ్వడం లేదు. అందుకే గత వారం నుంచి కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇకపై పార్టీ స్ట్రాటజీ పూర్తిగా మార్చేయనున్నారు. ఇకపై పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు కేసీఆర్.
పార్టీ పగ్గాలు చేపూని..
రెండు దశాబ్దాలుగా తెలంగాణను శాసిస్తూ వచ్చిన అధినేత కేసీఆర్. పార్టీ పగ్గాలు చేతబట్టి గతంలో అనేక అనూహ్య విజయాలకు కేరాఫ్ గా నిలిచారు. అయితే తొలిసారి కేసీఆర్ సైతం డైలమాలో పడ్డారు. అందుకే తన మైండ్ సెట్ పూర్తిగా మార్చేశారు. ఇకపై ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన ఉద్యమకారులను సైతం కలుపుకుపోవాలని చూస్తున్నారు. అంతేకాదు వారిలో ఉత్సాహం కలిగిన యవ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ చూస్తున్నారట. అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సామాజికవర్గ నేతలకు చేరువయ్యేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
యూత్ కి పెద్ద పీట
గతంలో వివిధ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యులుగా పనిచేసి అనుభవం కలిగిన యువ నేతలను పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాలలో వారికి అగ్ర తాంబూలం ఇవ్వాలని భావిస్తున్నరు కేసీఆర్. బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిషోర్ వంటి యువనేతలకు పార్టీ కమిటీలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు తదితర నేతలకు పార్టీ పరంగా విభజించి వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నారు. ఆగస్టులో పార్టీ ఆవిర్భావ సభను వైభవంగా నిర్వహించి కార్యకర్తలు, నేతలలో భరోసా ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ నేత ఉన్నారని సమాచారం. అలాగే సోషల్ మీడియాను యాక్టివేట్ చేసి కాంగ్రెస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. మళ్లీ బీఆర్ఎస్ కు పూర్వవైభవం తీసుకురావాలని కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.