TDP Leaders Focus on Rajampet Constituency: ఎన్నికల ఫలితాల షాక్ నుంచి ఇంకా కోలుకోని మాజీ సీఎం జగన్కి సొంత జిల్లాలో మరో షాక్ తగలబోతుందా? కడప జిల్లాలో జగన్కి సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిందా? ఆ మాజీని చేర్చుకోవడానికి టీడీపీ పెద్దలే పావులు కదుపుతున్నారా? ఎన్నికల్లో రికార్డ్ విజయం సాధించిన టీడీపీకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు అవసరమయ్యారు? అసలింతకీ వైసీపీలో అంత డిమాండ్ ఉన్న ఆ లీడర్ ఎవరు?
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంపై టీడీపీ పెద్దలు ఫోకస్ పెట్టారంట. సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలవ్వడంతో బలమైన కొత్త నాయకుడికి ఇన్చార్జ్ పగ్గాలు అప్పచెప్పటానికి కు అధిష్టానం కసరత్తు ప్రారంభించిందట. ఇదివరకే నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు టికెట్ ఆశించడంతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాలలో భాగంగా ఎన్నికల ముందు రాయచోటికి చెందిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. కానీ గెలవాల్సిన సీటు ఓడిపోవడంతో ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించిందట.
గడచిన ఇచ్చిన ఐదేళ్లపాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు రాజంపేట టీడీపీ ఇన్చార్జిగా ఉండగా ఎన్నికల సమయంలో చమర్తి జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశించారు. వీరితో పాటు మరికొంతమంది టికెట్ ఆశించినా వారందరినీ కాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు తనయుడు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యంకు టికెట్ ఇచ్చారు టీడీపీ అధినేత. దాంతో టికెట్ దక్కని నేతలు పార్టీకి వ్యతిరేకంగా లోపాయికారీగా ప్రత్యర్థి పార్టీకి సహకరించారన్న ఆరోపణలున్నాయి.
సొంతవారి వెన్నుపోట్ల వల్లే గెలవాల్సిన సీటు పోగొట్టుకున్నామని పార్టీ అధిష్టానం పోస్ట్మార్టంలో తేలిందంట. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత కొందరు నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో ఇప్పుడు ఉన్న నాన్ లోకల్ నేతలను కాదని మరో సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ అవసరమని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందులోనూ స్థానిక నేత అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారంట.
Also Read: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు
ఈ నేపథ్యంలోనే రాజంపేట నియోజకవర్గంలో మంచిపట్టున్న మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైపు టీడీసీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన 2014లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ లభించకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. టీడీపీ టికెట్ ఆఫర్ చేసినా ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల తర్వాత టిడిపి తరఫున ఉన్న నేతలందరూ నాన్ లోకల్ వారే కావడంతో చంద్రబాబు స్వయంగా మేడా వైపు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మేడా నియోజకవర్గంలో తన మార్కు చాటుకునేలా అభివృద్ది చేశారు. ఒంటిమిట్ట కోదండరాముడి నవమి వేడుకలకు రాష్ట్ర వేడుకగా గుర్తింపు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేడా హాయంలోనే చేపట్టారు. వాటికి తోడు కోదండరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తీసుకువచ్చారు. ఈ కారణంగానే మేడాకు మంచి సమర్థవంతమైన నేతగా నియోజకవర్గంలో గుర్తింపు లభించింది
ఓ వైపు అభివృద్ది చేయడంతో పాటు సొంత క్యాడర్ను బలోపేతం చేసుకున్న మేడా మల్లిఖార్ణునరెడ్డి.. పార్టీలతో సంబంధం లేకుండా గెలవడమే ఆయనసమర్ధతకు నిదర్శనం అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు మేడాను రాజంపేట టిడిపి ఇన్చార్జిగా నియమిస్తే పార్టీకి మళ్ళీ పుర్వ వైభవం రావడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారంట. అదే జరిగితే మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరమైన మేడా మరో మారు రాజంపేట నియోజకవర్గంలో చక్రం తిప్పడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.