Case file on Bhole Baba Satsang stampage incident 121 death
121 మందికి పైగా మృతిచెందిన సత్సంగ్ దుర్ఘటనకు సంబంధించి ఎట్టకేలకు ఆ ఘటనకు మూలకారకుడైన భోలే బాబాపై బీహార్ లో కేసు నమోదయింది. జులై 2న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నాలుగు రోజుల తర్వాత పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో భోలేబాబాపై కేసు నమోదయింది. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని , భద్రతా సిబ్బంది భక్తులను తోసివేయడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సత్సంగ్ కార్యక్రమం వేదిక నుంచి తాను వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు బాబా. పైగా ఈ సంఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చని భోలేబాబు చెబుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని తమ ఆశ్రమ కమిటీ సభ్యులను ఆయన కోరారు.
దర్యాప్తు వేగవంతం
భోలే బాబా తరపున ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించిన దేవ ప్రకాష్ మధుకర్ ను గత శుక్రవారమే సికిందరావు పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు దేవ ప్రకాష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. తొక్కిసలాట కేసులో అరెస్టయిన మరో నిందితుడు రాంప్రకాష్ షాక్యాను కూడా ఆదివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన హథ్రాస్ పోలీసులు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. భోలేబాబాకు అండగా ఉంటూ వస్తున్న రాజకీయ శక్తులు ఎవరు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఏ క్షణమైనా భోలే బాబా అరెస్ట్ ఉండవచ్చు.