Vice President Dhankhar Slams P. Chindambaram: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రూపొందించిన మూడు కొత్త చట్టాలపై చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ జగదీప్ మండిపడ్డారు. పార్లమెంట్ విజ్ఞతను అవమానించేలా చిదంబరం మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్ట్ టైమర్లు ఈ మూడు కొత్త చట్టాలను రూపొందించారంటూ ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం వ్యాఖ్యానించారు. దీనిపై ధన్ ఖడ్ తీవ్రంగా స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ‘ఈరోజు ఉదయం న్యూస్ పేపర్ లో వచ్చిన ఓ వ్యాసం చూసి నా హృదయం ఎంతో బరువెక్కింది. కొత్త నేర చట్టాలను పార్ట్ టైమర్లు రూపొందించారంటూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఆయన కూడా గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఎంతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న చిదంబరం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది’ అంటూ ఉపరాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు.
Also Read: ప్రిన్సిపల్ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది.. వీడియో వైరల్
‘పార్లమెంటు సభ్యులను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగేలా మాట్లాడొద్దు. దయచేసి చిదంబరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా అభ్యర్థనను కాంగ్రెస్ నేత పరిగణనలోకి తీసుకుని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి అన్నారు. తిరువనంతపురంలోని స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వలసవాద తత్వం నుంచి బయటపడేసిన ఈ నూతన చట్టాలను పార్లమెంట్ ఆమోదించినందుకు తనకు గర్వంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.