Budget Session to begin from July 22: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువుదీరింది. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
అయితే, ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ను తీసుకురానున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్ ఇదే. దీంతో పార్లమెంటులో వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Also Read: బీఎస్పీ అధ్యక్షుడి హత్యపై మాయావతి ఆగ్రహం.. తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి
2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత సీతారామన్ కు ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు ఫైల్ లో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారు.