Minister Satya Kumar Comments About Hospitals: ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులు నిజమైన దేవాలయాలు అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. యనమకుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణానికి కారణమైన వెలగపూడి ట్రస్ట్ దాతృత్వం వెలకట్టలేనిదంటూ మంత్రి అభినందించారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తామన్నారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామని ఆయన చెప్పారు.
నీట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించామని మంత్రి వివరించారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయన్నారు. పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలిందని మంత్రి స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కల్యాణ్ సందర్శించి పరిశీలించారు. వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచన చేసిన వాటిని పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని సూచించారు.
Also Read: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు
గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎలాంటి ఉత్పత్తులను సాధించవచ్చన్న అంశాలపై సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఓ ప్రదర్శన నిర్వహించారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరువాత తగులపెట్టడం వల్ల వాతావరణం కాలుష్యం పెరుగుతుందన్నారు. అలా కాకుండా వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందని, ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. రీ సైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలన్నారు. స్థానిక సంస్థలకు వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్ గా మారుతోందన్నారు. శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.