Rahul Gandhi latest news(Telugu news live today): లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో భజరంగ్ దళ్ శ్రేణులు రాహుల్ కాన్వాయ్ అడ్డుకున్నారు. ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. అంతే కాకుండా రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు.
పలువురు భజరంగ్ దళ్ కార్యకర్తలను వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అనతంరం రాహుల్ గాంధీ వెళ్లడానికి రూట్ క్లియర్ చేశారు. రాజ్ కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడం కోసం రాహుల్ గాంధీ ఇవాళ గుజరాత్కు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
నెల రోజుల క్రితం గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ శనివారం గుజరాత్ వెళ్లారు.
#WATCH | Ahmedabad, Gujarat: The Bajrang Dal protesters were detained by Gujarat Police.
Bajrang Dal had staged a protest against Congress MP and Lok Sabha LoP Rahul Gandhi's visit over his 'Hindu' remarks during his speech in Lok Sabha. pic.twitter.com/OT4LMNpa5Q
— ANI (@ANI) July 6, 2024
ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్, గుజరాత్లోని టీఆర్పీ గేమ్ జోన్ ఫైర్, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధితులను శుక్ర, శనివారాల్లో పరామర్శించిన రాహుల్ గాంధీ..తాజాగా మణిపూర్ లో పర్యటించనున్నారు. జూలై 8 న మణిపూర్లో రాహుల్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2023లో జాతుల ఘర్షణ మధ్య హింసాకాండకు దారి తీసింది. మణిపూర్ పర్యటనలో భాగంగా పునరావాస శిభిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను రాహుల్ పరామర్శించనున్నారు.
ఈ సందర్భంగా మణిపూర్ కాంగ్రెస్ కమిటీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. మణిపూర్లో ఏడాదిగా కొనసాగుతున్న హింసాకాండపై కాంగ్రెస్ తరచూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మెయితీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ర్యాలీ నిర్వహించడంతో గత ఏడాది మే 3 న మణిపూర్లో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఈ అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు.
మణిపూర్ అంశాన్ని ఇటీవల ముగిసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ లేవనెత్తగా ఆ రాష్ట్రంలో పూర్వ పరిస్థితి పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, 11 వందలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 500 మందికిపైగా అరెస్టు చేశామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మణిపూర్లోని రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది.