NEET UG 2024: నీట్ యూజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చేవరకు కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి నీట్ కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు లో నీట్ ఎగ్జామ్పై సోమవారం వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పేపర్ లీకేజీ వ్యవహారం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. గ్రేస్ మార్కుల వ్యవహారంతో వివాదం గాలివానగా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పేరెంట్స్ సంఘాలు ఆందోళనను తీవ్రతరం చేశాయి. పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం, నీట్పై వెనక్కి వెళ్లేదని లేదని తేల్చిచెప్పింది.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేమని శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఇప్పుడున్న సమయంలో పరీక్షను రద్దు చేయడం కుదరదని, దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారని దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు అది నష్టం చేకూరుతుందని వెల్లడించింది. నీట్ లీకేజీ కేసులో నిందితులను అరెస్టు చేశామని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని వివరించింది.
ALSO READ: త్రిపురలో డేంజర్ బెల్స్, హెచ్ఐవీతో 47మంది మృతి.. మరో 800 పైగానే…
ఈ లెక్కన నీట్పై సోమవారం తీర్పు వస్తుందని విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేకుంటే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలోపడ్డారు. జూలై నెల మొదలై వారం గడిచిపోయింది. ఇప్పటికీ కౌన్సెలింగ్ జరగకపోతే క్లాసుల పరిస్థితి ఏంటని అంటున్నారు.