Telangana Bonalu festival started from 7th july 14 secunderabad :
తెలంగాణ సంస్క్కతీసాంప్రాయలకు ప్రతీకగా జరుపుకునే బోనాల జాతర సందడి మొదలయింది. శనివారం నుంచి ఆషాఢమాసం ప్రారంభమైంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కొత్తగా ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బోనాల జాతర జరిపించాలని కొత్త సర్కార్ భావిస్తోంది. దీనికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. గోల్కొండలో మొదలై నెల రోజులపాటు జరిగే బోనాల జాతర తొలి ఆదివారం గోల్కొండ కోటలోని అమ్మవారికి తొట్టెలు, తొలి బోనం సమర్పణ, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపులతో సందడి మొదలుకానుంది.
శుక్రవారం అమావాస్య సందర్భంగా ఆదివారం జరగనున్న బోనాల దృష్ట్యా శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలో మెట్లకు స్థానికులు పూజలు చేశారు. ఇక నాలుగు వారాల పాటు జరగనున్న బోనాల జాతరలో భాగంగా.. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. తర్వాత ఈ నెల 21న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర, ఆ తర్వాత మళ్లీ బోనాల జాతరకు గోల్కొండ కోటలో ముగింపు సన్నాహాలు జరుగనున్నాయి.
భక్తులకు ఏర్పాట్లు
గోల్కొండ బోనాలకు వచ్చే భక్తజనుల కోసం జలమండలి తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోట ప్రారంభంలో ఉన్న మెట్ల దగ్గర నుంచి మొదలుకుని బోనాలు జరిగే ప్రాంతంవ వరకూ ఎక్కడికక్కడ తాగునీటి వసతుల కోసం ఏర్పాట్లు చేసింది. ఇందుకు అవసరమైన తాగునీటి డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, వంట చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా షెడ్లు కూడా సిద్ధం చేయడం విశేషం. ఎప్పటికప్పుడు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు కూడా అందుబాటులో ఉంచారు. వాటర్ క్యాంపుల దగ్గర టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వీలును బట్టి ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా పాయింట్లు ఏర్పాటు చేశారు. అందులో రామదాసు బంధిఖాన, చోటాబజార్, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్ హౌజ్ వద్ద కూడా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఆలయాలకు నిధులు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల జాతరను పురస్కరించుకుని నగరం, చుట్టుపక్కల పరిసరాలలోని ఆలయాలను ముస్తాబు చేయించుకోవడానికి రాష్ట్ర సర్కార్ ఇప్పటికే నిధుల పంపిణీ మొదలు పెట్టింది. 14న లష్కర్ బోనాలు, 21న పాతబస్తీతో పాటు న్యూ సిటీలో జరిగే బోనాలు ప్రశాంతంగా జరిగేలా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రత బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ కలెక్టర్ పర్యవేక్షణ
ఆషాఢమాసం బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.