Virat Kohli Shares His Experience On T20 WC Final Performance with PM Modi:టీ 20 ప్రపంచకప్ సాధించి, ఇండియాకి వచ్చిన క్రికెటర్లకి ఘన స్వాగతం లభించింది. అందులో గొప్ప విషయం ఏమిటంటే క్రికెటర్లందరూ ప్రధాని మోదీతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ క్రికెటర్లందరితో కలిసి చిట్ చాట్ చేశారు. తనే ఒక రిపోర్టరుగా మారి కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో విడుదల చేసింది.
ఇందులో ప్రధాని మోదీ సరదాగా విరాట్ తో మాట్లాడుతూ టోర్నీ అంతా ఒడిదుడుకులతో నడిచింది కదా? ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఎలా ఫీలయ్యావ్? అని అడిగారు. అందుకు విరాట్ మాట్లాడుతూ నిజానికి టోర్నీలో నా మార్క్ ఉండాలని ప్రతి మ్యాచ్ లో భావించాను. కుదరలేదు. ఒక సందర్భంలో ద్రవిడ్, రోహిత్ తో మాట్లాడాను. నా స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్నానని చెప్పాను. కానీ వాళ్లిద్దరూ నాపై నమ్మకం ఉంచారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వే అండగా ఉంటావని ధైర్యం చెప్పారని అన్నాడు.
అయితే ఫైనల్ మ్యాచ్ రోజు కూడా నాపై నాకు నమ్మకం లేదు. కానీ మొదటి ఓవర్ మూడు బౌండరీలు కొట్టేసరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే టచ్ కొనసాగించానని అన్నాడు. ఒకరకంగా నా టీ 20 కెరీర్ లో ఇది క్లైమాక్స్ మ్యాచ్ అనుకోవాలని అన్నాడు. అందుకే జీవితాంతం ఈ మ్యాచ్ గుర్తుంటుంది. ఫైనల్ వరకు టీమ్ ఇండియాలో అందరూ నడిపిస్తే, ఆ ఒక్క మ్యాచ్ లో నాకు అవకాశం దొరికిందని అన్నాడు.
Also Read: తొలి టీ20 మ్యాచ్లో భారత్పై దక్షిణాఫ్రికా విజయం
అయితే వరల్డ్ కప్ హీరో ఎవరంటే బుమ్రా అనే చెబుతానని అన్నాడు. ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను, తను ఒంటి చేత్తో గెలిపించాడని తెలిపాడు. అలాగే ఫైనల్ మ్యాచ్ లో పాండ్యా వేసిన ఆఖరి ఓవర్ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపాడు. అలాగే సూర్య క్యాచ్ సూపర్బ్ అని అన్నాడు. ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఆడారని తెలిపాడు. ఇక చివరి మూడు ఓవర్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ అత్యద్భుతమని కొనియాడాడు. ఇలా ప్రధాని మోదీ అందరి ఆటను విశ్లేషించడం చూసి ఆటగాళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.