ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి మరోలెక్క. పని ఏదైనా చకచకా జరిగిపోవాల్సిందే.. మాటలే కాదు చేతలు కూడా యమా స్పీడు.. రాజకీయంగా ఓనమాలు దిద్దుతూనే దూకుడూ చూపుతున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.. డాటర్ ఆఫ్ అశోక్ గజపతిరాజు. పూసపాటి వంశీయుల వారసురాలుగా రాచరికంలో పుట్టి.. కార్లు, బంగ్లాల్లో తిరిగిన ఆమె.. ప్రజాసేవ కోసం పరితపించి గత ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవించి నిలబడ్డారు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకుండా.. బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూనే తన మార్కు పాలిటిక్స్తో ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
విజయనగరం ఎమ్మెల్యేగా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన యువరాణి.. సరికొత్త రాజకీయం నడుపుతున్నారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అటు ప్రజలను.. ఇటు నాయకులను సమన్వయం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు తన అధినాయకుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటే.. అదితి మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అశోక్ గజపతి బంగ్లా గేటు కూడా ప్రజలు తాకలేరు అనే విమర్శలకు చెక్ పెడుతూ.. బంగ్లాలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు అదితి. సమయంతో సంబంధం లేకుండా ఓపికగా అందరి సమస్యలు వింటూ.. వెంటనే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరోపక్క ప్రత్యర్ధుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తున్నారు అదితి. తండ్రి అశోక్ గజపతిలా కాకుండా.. నా రూటే సేపరేటు అనే హెచ్చరికలు పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్రంలో ఉన్న వైసీపీ కార్యలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కూడా ఈమె కావడం చర్చనీయాంశంగా మారుతోంది. వైసీపీ భవనం అక్రమ కట్టడమని.. కేవలం వీధి లైట్ కే షో చేసే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాలను మాత్రం గుట్టుగా కడుతున్నప్పుడే అనుమానం వచ్చిందంటూ ఆరోపణలు చేశారు. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ కీలకనేత బొత్స సత్యనారాయణ కూడా స్పందించారంటే.. ఆమె వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చేశాయోనని హాట్ టాపిక్ నడిచింది. తన రాజకీయ జీవితంలో జిల్లాలోని టీడీపీ నేతల్లో అశోక్ గజపతి రాజు పేరు తప్ప.. ఎప్పుడూ ఏ ఒక్క ఎమ్మెల్యే పేరు పలకని బొత్స.. ఇప్పుడు అదితి పేరు ఎత్తడం ఉత్తరంద్ర రాజకీయాల్లో సైతం సంచలనంగా మారింది.
ప్రతిపక్షంలో ఉండగా, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అనుచరులు భూ దందాలు చేస్తున్నారని ఆరోపించిన అదితి.. గెలిచిన వెంటనే తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలను తవ్వి తీస్తున్నారు. మాన్సాస్ భవనాల్లోనే కాకుండా మున్సిపాలిటీ భూముల్లో సైతం ఎవరైనా అక్రమ కట్టడం నిర్మిస్తే కూల్చివేతే అనే హెచ్చరికలు జారీ చేశారు. మహారాణిపేటలో అక్రమంగా నిర్మించిన కార్ సర్వీసింగ్ షెడ్ వల్ల తమ ఇళ్ళల్లోకి వర్షపు నీరు వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయగానే షెడ్ ని తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లు ఆమె అసలు తమకు ప్రత్యర్ధి కాదని అవహేళన చేసిన వారు కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతోంది.
Also Read: పోలీస్ కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కోర్టు అనుమతి
మరోవైపు అధికారులతో కూడా వరుసగా సమావేశాలు చేపట్టడంతో గత పాలకులకి టెన్షన్ పట్టుకుంది. రోజుకో శాఖతో సమీక్ష నిర్వహిస్తూ నివేదికలు అడుగుతున్నారు ఎమ్మెల్యే అదితి. దేనికి ఎంత ఖర్చు చేశారు ? ఎంత అభివృద్ధి జరిగింది? ఎన్ని నిధులు కేటాయించారు వంటి వాటిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమీక్షలు కూడా తూతూ మంత్రంగా కాకుండా సుమారు రెండు గంటలు సమయం కేటాయిస్తున్నారంటే ఆమె ఎంత క్లారిటీగా ఉన్నారోనని భావిస్తున్నారు. వాస్తవానికి అదితి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతో పాటు స్వపక్షంలోని నేతలు కూడా ఊహించలేదని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్ పై కూడా అదితి బాగానే ఫోకస్ చేశారు. 50 మందిలో 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నప్పటికి.. ఆమె చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారట. అభివృద్ధే తమ లక్ష్యమని.. కలిసికట్టుగా పని చేద్దామని.. పార్టీలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారట. ఏ శాఖలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో నివేదికలు సిద్దం చేయాలని తెలిపారట. మొదటి సమావేశంలోనే తడబాటు లేకుండా తన అజెండా ఏంటో సూటిగా చెప్పేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిలా స్మూత్గా హ్యాండిల్ చేస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేయలేమని.. భిన్నమైన రీతిలో పావులు కదుపుతూ… మహారాణి దెబ్బ ఎలా వుంటుందో ప్రత్యర్థులకు రుచిచూపిస్తున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అందరి ఊహలకు అతీతంగా అదితి పనితీరు ఉండటం జిల్లా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. మరి అదితిది ఆరంభ సూరత్వమా లేక తానెంటో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నారో రానున్న రోజుల్లో బయటపడనుంది.