Female Fan apologises to Hardik Pandya: టీ20 వరల్డ్ కప్ -2024 కంటే ముందే ఐపీఎల్ సీజన్ కొనసాగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యపై తీవ్రమైన నెగెటివ్ ట్రోలింగ్ వచ్చింది. ముంబై కెప్టెన్సీ విషయంలో అతడిపై విమర్శలు చేశారు. అయితే, టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుపొందండంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.
దీంతో ఇప్పుడు అతడిని పొగడతలతో ముంచెత్తుతూ అభిమానులు జేజేలు కొడుతున్నారు. ముంబై వేదికగా జరిగిన విజయోత్సవంలోనూ హార్దిక్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఫైనల్ ఓవర్ లో 16 పరుగులను కాపాడి, భారత్ కు ఏడు రన్స్ తేడా కప్ ను అందించడంతో హార్దిక్ పాండ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా హార్దిక్ ను విపరీతంగా ట్రోల్ చేసిన ఓ మహిళా అభిమాని అతడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.
‘అన్నింటికంటే ముందుగా నేను హార్దిక్ పాండ్యకు క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పటివరకు నేను చేసిన ట్రోలింగ్ కు సారీ అడుగుతున్నా. మొదట్లో నేను ఎందుకు అతడిని ట్రోల్ చేశానో అర్థంకావడంలేదు. మరోసారి హార్దిక్ కు సారీ చెబుతున్నా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో హార్దిక్ చివరి ఓవర్ చిరకాలం గుర్తుండిపోతుంది. మీ గురించి నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అంటూ సదరు మహిళా అభిమాని క్షమాపణలు కోరింది. టీ20 ప్రపంచ కప్ లో హార్దిక్ 144 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ రాణించి 11 వికెట్లు తీశాడు. దాదాపు 17 ఏళ్ల తరువాత టీమిండియా రెండోసారి విజేతగా నిలవడంలో హార్దిక్ ముఖ్య భూమిక పోషించాడు.
Also Read: బార్బడస్ పిచ్ రుచి చూడటం వెనుక కారణమదే: రోహిత్ శర్మ
అయితే, జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారంటూ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమం సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘మన కోసం హార్దిక్ ఫైనల్ ఓవర్ వేశాడు. తీవ్ర ఒత్తిడి ఉండే అలాంటి సమయంలోనూ ముందుకు వచ్చి బౌలింగ్ వేశాడు. ఎన్ని పరుగులను కట్టడి చేయాలనేది పక్కన పెడితే.. టీ20ల్లో అత్యంత క్లిష్టమైన ఓవర్ అదే. బ్యాటర్లదే హవా ఉండే పొట్టి ఫార్మాట్ లో చివరి ఓవర్ ను వేసిన హార్దిక్ పాండ్యాకు హ్యాట్సాఫ్’ అంటూ రోహిత్ ప్రశంసించాడు.