Bihar Bridge Collapses 15 Engineers Suspended: బీహార్లో వంతెనలు పేకమేడల్లాగా కూలుతున్నాయి. గత రెండు వారాల్లో 12 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా వీలైనంత త్వరగా వంతెనలను పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్మాణ వ్యయాన్ని దోషులుగా గుర్తించిన కాంట్రాక్టర్లపై విధించనున్నట్లు సమాచారం.
వంతెనలు కూలిపోవడానికి కారణం ఇంజనీర్ల అసమర్థత, నిర్లక్ష్యమని పేర్కొంటూ ఫ్లయింగ్ స్క్వాడ్లు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంజనీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి చైతన్య ప్రసాద్ తెలిపారు. వరుస ఘటనల వెనుక కాంట్రాక్టర్ల అశ్రద్ధ ఉందని మండిపడ్డారు.
అంతకుముందు గురువారం ఉదయం బీహార్లోని సరన్ జిల్లాలో మరో వంతెన కూలింది. దీంతో గత పన్నెండు రోజులలో 17 వంతెనలు కుప్పకూలాయి.
Also Read: బీహార్లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో 10వ సంఘటన..
ఈ సంఘటనలపై RWD కార్యదర్శి దీపక్ సింగ్ స్పందించారు. అరారియాలోని భాక్రా నదిపై ఉన్న వంతెన కూలిన ఘటనలో నలుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యేవరకు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల నిలిపివేసినట్లు తెలిపారు. తనిఖీ బృందాలు తుది నివేదిక సమర్పించిన తర్వాత కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.