TDP Supporters give a grand welcome to AP CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్ లో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు.
Also Read: ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే.. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనున్నది. అయితే, ఇద్దరు సీఎంల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయ్యింది. పది అంశాల అజెండాను ఇరు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా, ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష, అనగాని హాజరుకానున్నారు. అదేవిధంగా అధికారుల బృందంలో ఏపీ నుంచి సీఎస్, ఆర్థిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరుకానున్నారు. విభజన సమస్యల పరిష్కారం, నిధులకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
Also Read: కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
ముఖ్యంగా.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. షీలా బీడే కమిటీ సిఫార్సులను సమీక్షించనున్నారు. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై కూడా చర్చించనున్నారు. అలాగే, ఉద్యోగ పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు.