Ramachandraiah and Hariprasad Elected as MLCs(AP latest news): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యిందంటూ రిటర్నింగ్ ఆఫీసర్ శుక్రవారం ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది.
దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమయ్యాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు. టీడీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. మరో స్థానాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్డీయే కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనంగా పూర్తయ్యింది.
రామచంద్రయ్య నేపథ్యమిదీ..
సి. రామచంద్రయ్య 1948 మే 27న వైఎస్సార్ జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపెల్ల గ్రామంలో జన్మించారు. 1981లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 1986 నుంచి 1988 వరకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా పనిచేశారు.
ఆ తరువాత రెండుసార్లు టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరఫున 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2012లో మంత్రిగా పనిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు.
2018లో వైసీపీలో చేరారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో ఎమ్మెల్యే కోటాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023 జనవరిలో వైసీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో 2024 మార్చి 12న శాసనమండలిలో రామచంద్రయ్యపై అనర్హత వేటు వేసినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read: గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్సీగా..
హరిప్రసాద్ ది ఏలూరు. విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో బీఎల్ పూర్తి చేశారు హరిప్రసాద్. లా చదివినప్పటికీ జర్నలిజం వృత్తిని ఎంచుకున్నారు. జర్నలిజంలో హరిప్రసాద్ కు విశేషానుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో వివిధ హోదాల్లో పని చేశారు. జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీ మీడియా హెడ్ గా, పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు.