Joe Biden Pleads For More Sleep: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో 81 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్ అలసిపోతాన్నారంటా. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి 8 గంటల తరువాత ఎలాంటి ప్రచారంలో తాను పాల్గొనలేనని, అందువల్ల అర్ధరాత్రి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో జోబైడెన్ మాట్లాడుతూ.. పై విధంగా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని విడుదల చేసింది.
అయితే, గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన డిబేట్లో జోబైడెన్ తడబడిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఇంకా రేసులో ఉండటంపై పలువురు గవర్నర్లు అసంతృప్తిగా ఉన్నా కూడా ఎవరూ ఆ విషయాన్ని నేరుగా మాత్రం ప్రస్తావించలేదని సమాచారం. మరోవైపు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటూ బైడెన్ స్పష్టం చేశారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడంలేదు. నేను పోటీ నుంచి వైదొలగడంలేదు. చివరివరకు పోరాడతాను.. మనమే గెలువబోతున్నాం. అందుకు మీ సపోర్ట్ కావాలి’ అంటూ విజ్ఞప్తి చేస్తూ తన మద్దతుదారులకు బైడైన్ లేఖ రాశారు.
Also Read: బ్రిటన్ ఎన్నికలు.. స్టార్మర్కు ప్రధాని మోదీ అభినందనలు..
ఇదిలా ఉంటే.. ట్రంప్తో జరిగిన డిబేట్లో తడబాటుకు గల కారణాన్ని బైడెన్ ఇదివరకే వివరించారు. తన సిబ్బంది ఎంత వారించినా కూడా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు చెప్పారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని బైడెన్ తెలిపారు. అందుకే డిబేట్లో ట్రంప్తో సరిగా వాదించలేకపోయినట్లు ఆయన పేర్కొన్నారు.