AP CM Chanrababu and Telangana CM Revanth Meeting: జులై 6న అనగా రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రగతి భవన్ లో అధికారులు ఏర్పాట్లు చేశారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావటం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది.
విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 24 వేల కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ. 7 వేల కోట్లు మాత్రమే తెలంగాణకు తమ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందంటూ ఏపీ పట్టుబడుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది.
Also Read: గత ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్ అయ్యన్న
ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని కూడా వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్న విషయం తెలిసిందే.