sentiment analysis not workout in recent Elections bjp,brs,ycp :
మొన్నటి సార్వత్రిక ఎన్నికలు అటు కేంద్రం, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలకు కోలుకోలేని దెబ్బ తీశాయి. ఎన్నికలు పూర్తయి రెండు నెలలవుతున్నా.. ఇప్పటికీ ఆ పార్టీ ప్రధాన నేతలకు తాము ఎందుకు ఓడిపోయామో అని విశ్లేషించుకుంటూనే ఉన్నారు. ఎక్కడ లోపం జరిగింది.. ఎందుకు తామ ప్రజా ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చిందనేది ఇంకా వాళ్ల మస్తిష్క పొరలలో వేధిస్తూనే ఉంది. కేంద్రంలో బీజేపీ రాజకీయంగా ఏకంగా రాముడినే వాడుకుంది. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు పర్యాయాలు తాను బలంగా నమ్ముకున్న సెంటిమెంటే గత ఎన్నికలలోనూ వాడుకుంది. ఇక ఏపీలో జగన్ సైతం తన తండ్రి మరణం తర్వాత రగిలిన ఎమోషన్ లో గెలిచేసి మళ్లీ అదే ఎమోషన్ తో ఓట్లను రాబట్టుకోవాలనుకున్నారు. అయితే వీరి ముగ్గురి కీ సార్వత్రిక ఓటింగ్ సాక్షిగా జనం దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు.
హ్యాండిచ్చిన రాముడు
గడిచిన రెండు పర్యాయాలు రాముడిని నమ్ముకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది బీజేపీ. అదే ఇనుమడించిన ఉత్సాహంతో ఏక్ బార్ ఫిర్ అంటూ 400 సీట్లు పక్కా అని ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. దాని వెనుక ఓ కారణం లేకపోలేదు. రెండు పర్యాయాల కన్నా ఈ సారి ఎందుకంత నమ్మకంతో చెప్పడానికి ప్రధాన కారణం రామ మందిర నిర్మాణమే. అయితే బీజేపీ ప్రచారాస్త్రాన్ని కాంగ్రెస్ కూటమి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది. తమ పార్టీకి 40 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసిన బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వమే దిక్కనేలా చేయడంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. జనాలకు కావలసినది మత రాజకీయాలు, దేవుళ్లు కావని ఆలస్యంగానైనా బీజేపీ గ్రహించింది. ఇకనైనా ప్రజలకు ఏమి కావాలో? దేశంలోని ప్రధాన సమస్యలేమిటో దృష్టి పెడితేనే ఆ పార్టీకి మనుగడ అని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్న మాట. మరి ఆ దిశగా తమ దశ మార్చుకుంటుందేమో బీజేపీ.. వేచిచూడాలి.
బీఆర్ఎస్ సెంటిమెంట్ రివర్స్
తెలంగాణ సెంటిమెంట్ తో పడుతూ, లేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో కొనసాగింది అవలీలగా. కానీ మూడో సారి మాత్రం బీఆర్ఎస్ సెంటిమెంట్ కు భారీ ఎత్తున గండిపడింది. తాము ఏం చెప్పినా నమ్మెస్తారని ఆ పార్టీ అగ్రనేతలు భావించడమే ఇందుకు కారణం. పైగా మూడోసారి చాలా ఈజీగా గెలిచేస్తామని మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆ పార్టీ నేతలలో కనిపించింది. తెలంగాణ సెంటిమెంట్ అయితే వర్కవుట్ అయింది ఈ పదేళ్లలో కానీ అందుకు తగ్గ రీతిలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలు తమకు అన్యాయమే జరిగిందని భావించడమే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణం. సామాన్య ప్రజల పక్షాన చేరకుండా కేవలం సమాజంలో కొన్ని వర్గాలనే నెత్తినెక్కించుకోవడం, ఉద్యమకారులను పక్కన పెట్టడం, ఇతర పార్టీలనుంచి వలస వచ్చినవారికి పెద్ద పీట వేయడం ఇవన్నీ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ సెంటిమెంటు రాజేయ్యాలని చూసినా ఓటర్లు మాత్రం దానిని తిప్పికొట్టారు.
వర్కౌట్ కాని వైసీపీ ఎమోషన్
రాజకీయాల్లో ఎమోషన్స్ తీవ్ర ప్రభావం చూపుతాయనేది బహిరంగ రహస్యమే. కానీ ఎల్లకాలం ఎమోషన్స్ ఆశించిన ఫలితాలను పంచిపెట్టలేవు. ఈ విషయాలను అంచనా వేయడంలో వైసీపీ, విఫలమయింది. వైఎస్ఆర్ మరణం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అన్నీ కలిసొచ్చి జగన్ అధికార పీఠం దక్కించుకోగలిగారు. కానీ దానిని ఎంతో కాలం నిలబెట్టుకోలేక తిరిగి అధికారం కోల్పోయారు. వైఎస్ చరిష్మా, ఆయన మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పై ప్రజల్లో సానుభూతి పెరిగింది.
అదే సమయంలో ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ కలిసి రావడంతో జగన్ అనుకున్న లక్ష్యాన్ని 2019లో రీచ్ అయ్యారు. కానీ.. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడకుండా ఉదాసీనంగా వ్యవహరించింది వైసీపీ. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ కార్యాకర్తలను కాదని వాలంటీర్లను నమ్ముకొని మోసపోయింది. పైగా నియంత్రణ లేని మంత్రి వర్గం ఇష్టారీతిన నోరు పారేసుకోవడం, చంద్రబాబును జైలుకు పంపడం వంటి చర్యలు అన్నీ వైసీపీపై వ్యతిరేకత పెంచాయన్నది వాస్తవం. తండ్రి ఎమోషన్ మాత్రం ఎంత మాత్రం జగన్ కు వర్కవుట్ కాలేదు.