CBI: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 2న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. యూసఫ్గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడు, వ్యాపారవేత్త వెంకటేశ్వరరావు, సనత్నగర్కు చెందిన రవి, మరోవ్యక్తికి సీబీఐ నోటీసులు పంపిందని సమాచారం.
సీబీఐ ఢిల్లీ బ్రాంచ్లో వెంకటేశ్వరరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పగటి పూట లారీలు తిరిగేందుకు అనుమతులు ఇప్పిస్తానని రవి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇక సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్ మెంట్ చేస్తానని చెంచు నాయుడిని శ్రీనివాస్ నమ్మించినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ ఐపీఎస్ అధికారి అని నమ్మి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఆ వ్యాపారవేత్తలు బంగారు అభరణాలను ఇచ్చినట్లు ప్రాథమికంగా నిర్దారించింది. ఆ నలుగురు వ్యాపారులను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ భావిస్తోంది.
వాల్తేర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న శ్రీనివాస్ అక్కడ వ్యాపారవేత్త పేరుతో మోసాలకు పాల్పడినట్లు సీబీఐ నిర్ధారించింది. ఢిల్లీలో మకాం వేసి గత ఐదేళ్లుగా సీబీఐ అధికారినంటూ దందాలు, సెటిల్మెంట్ల పేరుతో అనేకమంది వద్ద డబ్బులు దండుకున్న శ్రీనివాస్ ను 3 రోజుల కిందట సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.