CM Chandrababu visit Hyderabad(Telangana news live): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రానుండడంతో నేతలు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. అయితే ఈ ర్యాలీకి పలు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు పోలీసులు.
రెండురోజుల టూర్లో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బిజిబిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి మొదలు మంత్రుల వరకు అందర్నీ కలిశారు. అటు నీతి ఆయోగ్ ముఖ్యులను కలిశారు. ఆర్థికంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్ర హైదరాబాద్కు రానున్నారు సీఎం చంద్రబాబు.
ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఆ హోదాలో హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి. దీంతో అధినేతకు స్వాగతం పలికేందుకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బేగంపేట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగుతుంది. అది కూడా కేవలం సాయంత్రం ఆరుగంటల నుంచి ఎనిమిది వరకు మాత్రమే ఇచ్చారు పోలీసులు.
బేగంపేట నుంచి జూబ్లీహిల్స్లోని సీఎం చంద్రబాబు నివాసం వరకు 50 కార్లు, 150 బైకులతో సాయంత్రం ర్యాలీ చేపట్టాలని టీటీడీపీ భావించింది. ఆ మేరకు పోలీసుల్ని అనుమతి కోరారు. దీనికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కాకపోతే కొన్ని షరతులను విధించారు. 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనరాదని షరతు విధించారు. అంతేకాదు డీజేలు, పేపర్ స్ప్రే గన్స్ వాడొద్దని సూచన చేశారు. హైదరాబాద్ సిటీలో పలు కూడలి వద్ద పసుపు తోరణాలు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి.
ALSO READ: మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్లో షాక్
శనివారం ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దీని తర్వాత ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్కు రానున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. తెలంగాణ కొత్త అధ్యక్షుడు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై నేతలతో చర్చించనున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.