Another Bridge Collapsed In Bihar: బీహార్లో వంతెనలు కూలిపోవడం షరా మామూల్ అయ్యింది. బీహార్లోని సరన్ జిల్లాలో ఇవాళ మరో వంతెన కూలిపోయింది. కాగా గత 24 గంటల్లో సరన్ జిల్లాలో ఇది రెండో సంఘటన. అటు గత పక్షం రోజుల్లో బీహార్లో 10 వంతెనలు కూలిపోయాయి.
గురువారం సరన్ జిల్లాలోని గండకీ నదిపై బనేయపూర్, జిల్లాలోని ఇతర ప్రాంతాలను కలిపే వంతెన కూలిపోయింది. కాగా ఈ బ్రిడ్జ్ 15 ఏళ్ల క్రితం నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. అయితే వంతెన కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటు బుధవారం రోజున సరన్ జిల్లాలోని జంటా బజార్, లహల్దాపూర్ ప్రాంతాల్లో రెండు వంతెనలు కూలిపోయాయి.
సరన్ జిల్లాలో చిన్న వంతెనలు కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు డీఎం తెలిపారు. స్థానికులు మాత్రం గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న వంతెనలు కూలిపోయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గత పక్షం రోజుల్లో సివాన్, సరన్, మధుబని, అరారియా, ఈస్ట్ చంపారన్, కిషన్గంజ్ జిల్లాల్లో మొత్తం 10 వంతెనలు కూలిపోయాయి.
Also Read: వారంలో మూడో బ్రిడ్జ్.. వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. బీహార్లో మరో వంతెన..
రాష్ట్రంలోని పాత వంతెనలన్నింటిపై సర్వే నిర్వహించి తక్షణ మరమ్మత్తులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించిన మరుసటి రోజే తాజా ఘటన చోటుచేసుకుంది.
వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో.. బీహార్ రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన. నిర్మాణంలో ఉన్న, పాత వంతెనల నిర్మానాలకు సంబంధించి ఆడిట్ కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు అడ్వకేట్ బ్రజేశ్ సింగ్. బీహార్లో గత రెండేళ్లలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన వంతెనలు, అనేక ఇతర వంతెనలు కూలిన సంఘటనలు జరిగినందున తక్షణ సమస్యను సుప్రీం కోర్టు అత్యవసరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయవాది బ్రజేష్ సింగ్ దాఖలు చేసిన పిల్ పేర్కొంది.
అన్ని వంతెనలను నిరంతరం పర్యవేక్షించడం కోసం, సమగ్ర డేటాబేస్ నిర్వహించడం కోసం ఉన్నత స్థాయి నిపుణులతో శాశ్వత సంస్థను ఏర్పాటు చేయడానికి కోర్టు బీహార్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది కోరారు.