Dhanush Captain Miller update(Cinema news in telugu): కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్ టైనర్గా వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది విడుదలై మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దాదాపు ఈ మూవీ రూ.100 కోట్లు వసూళ్లు చేసి ధనుష్ కెరీర్లో హిట్ లిస్ట్లో చేరింది. తాజాగా, ఈ మూవీకి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లభించింది.
లండన్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ‘కెప్టెన్ మిల్లర్’ సత్తా చాటింది. ఇందులో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గుర్తింపు పొందింది. అంతకుముందు గ్రే మ్యాన్ మూవీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’ మూవీకి వచ్చిన అవార్డుతో ఆయన పేరు హాలీవుడ్ల్లోనూ ట్రెండ్గా మారింది.
ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ చిత్రాలతో పోటీపడడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ మూవీ కూడా నామినేషన్లో చోటు దక్కించుకుంది. అయితే అవార్డు అందుకోలేకపోయింది.
‘కెప్టెన్ మిల్లర్’ మూవీలో ధనుష్ పక్కన ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, జాన్ కొక్కెన్ సహాయక పాత్రల్లో నటించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇందులో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల రికార్డు..ఎంత వసూళ్లు చేసిందంటే!
ధనుష్ ప్రస్తుతం ‘రాయన్’లో నటిస్తున్నారు. ఈ మూవీకి ఆయనే స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధనుష్ 50’గా వస్తున్న ఈ మూవీ జులై 26న విడుదల కానుంది. ఇందులో సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు.