Jagan Met Ex MLA Pinnelli: వైసీపీ అధినేత జగన్ కొత్త విషయాన్ని బయటపెట్టారు. గడిచిన ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసి తాము ఓడిపోయామని, ఇది వ్యతిరేకత వల్ల కాదని కుండబద్దలు కొట్టేశారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం ఇటు నుంచి అటువైపుకు వెళ్లారన్నారు. అంతే తప్పితే మా మీద ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.
ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుంచి నెల్లూరు చేరుకున్నారు. నేతలతో కాసేపు మాట్లాడిన తర్వాత జైలుకి వెళ్లారు. అక్కడ దాదాపు పావు గంటసేపు పిన్నెల్లితో మాట్లాడారు. జైలులో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారాయన. ఈ క్రమంలో పిన్నెల్లి కంటతడి పెట్టినట్టు తెలుస్తోంది.
పిన్నెల్లితో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడారు జగన్. పిన్నెల్లి ముమ్మాటికీ మంచోడని, అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. రిగ్గింగ్ జరుగుతుందనే ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారని, అన్యాయం జరుగుతుందనే ఈవీఎంలను బద్దలు కొట్టారంటూ జగన్ సమర్థించుకునే పని చేశారు. అంతేగానీ తమ పార్టీ నేత చేసింది తప్పని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఘటన జరిగి పది రోజుల తర్వాత హత్యాయత్నం కింద కేసు పెట్టారన్నారు. పిన్నెల్లిని అన్యాయంగా జైలులో పెట్టారని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
పనిలోపనిగా చంద్రబాబు సర్కార్పై నాలుగు రాళ్లు వేశారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తోందని దుయ్యబట్టారు. వైఎస్ విగ్రహాలను టీడీపీ కేడర్ ధ్వంసం చేస్తోందని, టీడీపీకి ఓట్లు వేయలేదని తమ కేడర్పై కేసులు పెడుతున్నారన్నది ఆయన మాట. దాడులతో భయపెట్టి రాజకీయాలు చేయడం సరికాదని, సీఎం చంద్రబాబుకు ప్రజలు త్వరలో బుద్ది చెబుతారని చెప్పకనే చెప్పేశారు.
ALSO READ: ఏపీలో.. ఏపీఎండీసీ, పీసీబీ కీలక పేపర్స్ దహనం, ఎవరి పని?
ప్రభుత్వం వచ్చి నెలరోజులైనా ఇప్పటివరకు రైతు భరోసా, తల్లికి వందనం, మహిళలకు 1500 రూపాయ లు ఎక్కడంటూ ప్రశ్నించారాయన. జగన్ మాటలను గమనించిన రాజకీయ నేతలు రకరకాలుగా చర్చించు కోవడం మొదలైంది. పార్టీ ఓటమి పాలైనా జగన్ సోషల్మీడియా తరహాలోనే మాట్లాడుతున్నారని అంటున్నారు. మంచి చేయడంవల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పడం చూసి నవ్వుకుంటున్నారు. 2014లో ఎలాగైతే వ్యవహరించారో ఇప్పుడు అలాగే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.