Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ బీసీల పొట్టగొట్టి, తన పొట్ట పెంచుకున్నారని విమర్శించారు. బీసీలకు ఇదేం ఖర్మ అని చంద్రబాబు అన్నారు. బీసీ సంఘాలు ఇంటింటా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో పేరుకే బీసీలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా అగ్ర కులాలకు అప్పగించారని చంద్రబాబు విమర్శించారు. బీసీలను జగన్ అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప 140 బీసీ కులాల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో 50 శాతంపైగా ఉన్న బీసీలకు వివిధ నామినేటెడ్ పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువని తెలిపారు. వీసీలు, సలహాదారుల్లో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారో చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
కొయ్యలగూడెంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా.. వచ్చే దారిలో గోడలు కడుతున్నారని మండిపడ్డారు. సీఎం వస్తుంటే ఆ ప్రాంతంలో రెండ్రోజులు సెలవు ఇస్తున్నారని తెలిపారు. జగన్ సభకు డ్వాక్రా మహిళలు తప్పక రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ రోడ్షోలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదని ఆరోపించారు. 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తానన్న సీఎం జగన్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, ఖనిజాలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పేదలను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.