Chandrababu Serious on MLA: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం జరిగిన ఘర్షణపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను పిలిచి వివరణ కోరారు. కంభంపాడులో వైసీపీ నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు దగ్గరుండి కూల్చివేయించారు. దీంతో ఈ అంశంపై సీఎం ఎమ్మెల్యేను వివరణ కోరారు.
కొంత మంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించమని తాను కోరినా పట్టించుకోకపోవడం వల్లే తాను వెళ్లినట్లు కొలికపూడి సీఎంకు వివరించారు. 2013లో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడి, ఇటీవల ఎన్నికల్లో కేశినేని చిన్నిపై దాడి ఘటనలను కూడా వివరించారు. ఇదిలా ఉంటే దోషుల్ని చట్ట ప్రకారం శిక్షించాలి తప్పా.. క్షేత్ర స్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దని సీఎం ఎమ్మెల్యేకు సూచించారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు భవన కూల్చివేత అంశం చర్చలకు దారి తీసింది. ఎ. కొండూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మీ, భర్త చెన్నారావు అక్రమంగా భవనం కడుతున్నారని ఫిర్యాదు రావడంతో బుల్ డోజర్ తో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు, అధికారులు వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పినా ఎమ్మెల్యే వినకుండా భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడానికి కారణం అయ్యారని బాధితులు ఆరోపించారు.
ఎమ్మెల్యే వ్యవహారశైలి చర్చకు దారితీయడంతో బాధితులు ఎమ్మెల్యే, అతడి అనుచరులపై బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా వారిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై కేసు నమోదు అవడంతో ఆయన అసహనానికి గురయ్యారు.
Also Read: ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు !
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్వయంగా తాను చెప్పినా కూడా అధికారులు స్పందించడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. బాధితులకు న్యాయం చేయనప్పుడు ఈ పదవి శాశ్వతం కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఎమ్మెల్యే వెలగపూడి శ్రీనివాస రావు వ్యాఖ్యలను తెలుసుకున్న చంద్రబాబు ఆయనను పిలిపించుకుని మాట్లాడారు. చట్టపరిధిలోనే దోషులను శిక్షించాలని తెలిపారు.