Kavitha : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటలు యుద్ధం మరింత ముదురుతోంది. కాషాయ పార్టీపై ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన బీజేపీని భయపెట్టిందని కవిత ట్వీట్ చేశారు. అందుకే టీఆర్ఎస్ నేతలపై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
కాషాయ పార్టీ చౌకబారు ఎత్తుగడలను ప్రజలే తిప్పికొడతారని కవిత స్పష్టం చేశారు. ఆ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం లాంటి చర్యలు టీఆర్ఎస్ వద్ద పనిచేయవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే విషయంలో తమను ఏ శక్తి ఆపలేదని కవిత స్పష్టం చేశారు. విచ్ఛిన్నకర, కుటిల రాజకీయ శక్తులను పాతరేసిన చరిత్ర తెలంగాణ ప్రజలదని గుర్తు చేశారు.
అంతకు ముందు మీడియా మీట్ లోనూ కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఏ రాష్ట్రానికైనా ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఆరోపించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ప్రధాని మోదీ వచ్చే ముందే రాష్ట్రానికి ఈడీ వచ్చిందని తెలిపారు. టీఆర్ఎస్ నేతలపై కుట్రపూరితంగానే కేసులు పెడుతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.