ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు పెట్టింది. ప్రతీ సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురు నిందితులు తమ పాస్ పోర్టులు సరెండర్ చేయాలని.. దేశం విడిచి వెళ్లొద్దని ఉత్తర్వులో తెలిపింది. 3 లక్షల పూచీకత్తుతో రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజులుకు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.
ఫాంహౌజ్ కేసులో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించారు. నిందితులు ముగ్గురు బీజేపీ పెద్దలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని.. బీఎల్ సంతోష్ తో చేసిన వాట్సాప్ చాట్ వివరాలను కోర్టు ముందుంచారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.
అటు, సిట్ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోందని.. కావాలంటే సీబీఐ చేతనో, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని నిందితుల తరఫు లాయర్ వాదించారు.
ఆధారాలు ఉన్నాయని సిట్.. సిట్ మీద నమ్మకం లేదని నిందితులు.. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వాయిదా వేసింది హైకోర్టు. తాజాగా, ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.