TTD: శ్రీవారి ఆలయం సంపూర్ణంగా స్వర్ణమయం కానుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయనున్నారు. ఆరు నెలల్లో తాపడం పనులు పూర్తి చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులు సమర్పించే బంగారంతోనే ఆనంద నిలయానికి తాపడం చేయించనున్నారు. ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభించనున్నారు.
టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
పద్మావతి గృహంలో రూ. 3.8 కోట్లతో గదులు నిర్మించడం.. నందకం అతిథి గృహంలో రూ.2.95 కోట్లతో కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేయడం.. బాలాజీ కాలనీలో రూ. 3 కోట్లతో స్థానికుల ఇళ్లకు మరమ్మతులు చేయించడం.. ఇలా పలు నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలక మండలి.
జమ్ములో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.7 కోట్లు, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో హాస్టల్ గదుల నిర్మాణానికి రూ. 3.3 కోట్లు, తిరుపతి తాతయ్య అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.3.7 కోట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.