Sharmila: వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిపై సడెన్ గా బదిలీ వేటు పడింది. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదేమీ సాధారణ ట్రాన్స్ ఫర్స్ లో భాగం కాదు. ఆయన ఒక్కడినే బదిలీ చేశారు. ఇది షర్మిల కేసు ఎఫెక్టే అంటున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట పరిధిలో వైఎస్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. షర్మిల ఫ్లెక్సీలు తగలబెట్టి.. ఆమె కారవ్యాన్ కు సైతం నిప్పు పెట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి.. అక్కడి వారిని చెదరగొట్టారు. ఇక్కడి వరకూ ఓకే. మరి, షర్మిలను ఎందుకు బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్టు? ఏదో అరెస్ట్ చేశారే అనుకున్నా.. ఆమెను అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు ఎందుకు తరలించినట్టు? వరంగల్ పోలీసులు చేసిన ఈ పనికి.. రాజధానిలో పెద్ద రచ్చే జరిగింది. ధ్వంసమైన కారులో షర్మిల ప్రగతి భవన్ కు బయలు దేరడం.. పోలీసులు అడ్డుకోవడం.. షర్మిలను కారుతో సహా లిఫ్ట్ చేసి స్టేషన్ కు తరలించడం.. రోజంతా ఫుల్ రేంజ్ లో మీడియా కవరేజ్ లభించడంతో షర్మిలకు ఫుల్ హైప్ వచ్చింది. పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఎక్కడో వరంగల్ రూరల్ జిల్లాలో.. మారుమూల ప్రాంతంలో.. షర్మిల ఘటన జరిగితే.. ఆ ఇష్యూను అక్కడే క్లోజ్ చేయకుండా.. ఆమెను హైదరాబాద్ వరకూ తీసుకురావడమే ఇంతటి వివాదానికి కారణమని పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ డ్యామేజీకి బాధ్యుడిని చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు వేశారని అంటున్నారు.