Steve Waugh : ఔననే అంటున్నాడు… ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా. మోతాదుకు మించిన క్రికెట్ ఇప్పుడు అభిమానులకు అందుబాటులో ఉందని… ఒకప్పుడు ఇచ్చినంత మజాను ఇప్పుడు ఏవో కొన్ని మ్యాచ్లు తప్ప అన్ని క్రికెట్ మ్యాచ్లు ఇవ్వలేకపోతున్నాయని అభిప్రాయపడ్డాడు… స్టీవ్ వా. ఆయన మాటల్లో నిజం ఉందని… ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ల్ని చూస్తే… ఇట్టే అర్థమైపోతుంది.
వన్డే వరల్డ్కప్, T20 వరల్డ్కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, ఆసియా కప్, యాషెస్ సిరీస్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలే కాకుండా… క్రికెట్ ఆడే దేశాల మధ్య జరిగే టెస్ట్, వన్డే, T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఏడాదికి లెక్కలేనన్ని జరుగుతున్నాయి. వాటికి తోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, కరేబియన్ టీ20 లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్ లాంటి వాటికి కూడా కొదవేమీ లేదు. ఆటగాళ్లంతా అటు దేశంతో పాటు వివిధ లీగ్ లకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో… వాళ్ల షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటోంది. వీటన్నింటి విషయంలోనూ ఇప్పుడు స్టీవ్ వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయని, అవన్నీ చూడటం ఎవరి వల్లా కావడం లేదని, ఫ్యాన్స్ కనీసం వాటిని ఫాలో కూడా కాలేకపోతున్నారని స్టీవ్ వా ఆవేదన వ్యక్తం చేశాడు. T20 వరల్డ్కప్ ముగిశాక ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీసే ఇందుకు ఉదాహరణ అని చెప్పాడు. మ్యాచ్లకు కనీసం స్టేడియం కూడా నిండనప్పుడు ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు… స్టీవ్ వా. ఇప్పటికే క్రికెట్ చాలా ఎక్కువైపోయిందని, ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లను కూడా తమ అభిమానులు ఎక్కువగా చూడట్లేదని వా వాపోయాడు. యాషెస్ లాంటి సిరీస్ల కోసం అభిమానులు ఎదురుచూస్తారని… కానీ, ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కెప్టెన్, ఒక్కో టీమ్ ఉన్నప్పుడు… ఫ్యాన్స్ ఆటను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదనేది… స్టీవ్ మాట. ఏదైనా మ్యాచ్ జరుగుతుంటే ఎవరెవరు ఆడుతున్నారా? అని ఆటగాళ్లను వెతుక్కోవాల్సి వస్తోందని… తాము అభిమానించే ఆటగాళ్లు లేనప్పుడు ఫ్యాన్స్ మ్యాచ్లు చూడట్లేదని వా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా మితిమీరిన క్రికెట్ తగ్గిస్తే… మళ్లీ ప్రేక్షకుల్లో మ్యాచ్ల మీద ఆసక్తి పెరుగుతుందని వా చెబుతున్నాడు. మరి అతని మాటను కనీసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అయినా పట్టించుకుంటుందో? లేదో? చూడాలి.