Kala Bhairava Ashtami : పిలిచిన పలికే దైవం, భక్తుల బాధలను గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మబంధాల నుంచి విమోచనం కలిగించ గల శక్తి ఉన్న శ్రీకాలభైరువుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన, విశేషమైన రోజు కాలభైరవాష్టమి. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు కాలభైరవాష్టమి. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజేకాలభైరవాష్టమి. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవుడు – కాలభైరవుడు.
కాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ… సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించాలి. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం ఉండాలి. ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకమ్ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. కాలభైరవాష్టమిని జరుపుకుంటే సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
సుమంగళిగా తనువు చాలించాలన్న స్త్రీమూర్తుల కోరిక నెరవేరాలంటే ఈపూజ ఆచరించాలి. భారతదేశంలో ఏ స్త్రీ అయినా భర్తకన్నా ముందే సుమంగళిగా మరణించాలను అనుకుంటుంది. అది స్త్రీల గొప్పతనం. అలాంటి వారి కోసం కాలభైరవష్టమి వ్రతం ఆచరించాలని శాస్త్ర పురాణం చెబుతోంది. అలాంటి ఇంట్లో ఎలాంటి దొంగల భయం లేకుండా.. ఎవరి చేతుల్లో మోసం పోకుండా ఉండేందుకు ఈ పూజ సహాయపడుతుందని నమ్మకం.
కాల భైరవ అష్టమి రోజున దేవాలయంలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం, గారెలతో మాల వేసి కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలోని సమస్త గ్రహదోషములు తొలగి ఈశ్వర అనుగ్రహంతో ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాక ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి , భైరవుని తలచుకొని 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగిస్తే బైరవుని అనుగ్రహం కలుగుతుంది.