Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను, లోకేశ్ ను కూడా చంపించేవారమని రాయలసీమలో ఓ వైసీపీ నేత అంటున్నాడు.. అప్పట్లో మొద్దుశీను నన్ను కూడా లేపేసేవాడట.. జగన్ కు రౌడీలు ఉంటే, నాకు ప్రజలు ఉన్నారు” అంటూ చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. చివరి అవకాశం తనకు కాదని, ప్రజలకే ఇది లాస్ట్ ఛాన్స్ అన్నారు. ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించారు చంద్రబాబు.
“ఎన్నికల్లో వైసీపీని గెలిస్తే అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తారని ఆనాడే వివరించా. ప్రజలు ఇప్పుడు కూడా నా మాట వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుంది. నాకు కాదు. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశాను. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎమ్మెల్యే పదవితో పనిలేదు. ఈ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి. ధైర్యంగా ముందుకు రావాలి. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుంది” అన్నారు చంద్రబాబు.
వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు అన్నారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. దీనిపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేందుకు అర్హత ఉందా? అని నిలదీశారు.