Twitter Users Data Leaked : ట్విట్టర్ను కొన్న తర్వాత ఉద్యోగులు, యూజర్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు… మస్క్. ఇప్పుడు వినియోగదారులు షాకయ్యేలా మరో వార్త బయటికొచ్చింది. అదే… 54 లక్షల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్ న్యూస్. అంతర్గత లోపం ద్వారా ట్విట్టర్ వినియోగదారుల డేటాను చోరీ చేసి ఆన్లైన్లో ప్రైవేట్గా షేర్ చేసినట్టు సమాచారం.
దాదాపు 54 లక్షల మంది యూజర్ల డేటా లీక్ కావడంతో పాటు… 14 లక్షల ట్విట్టర్ ప్రొఫైల్స్ చోరీ అయ్యాయని చెబుతున్నారు. ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్-APIని ఉపయోగించి… సెలబ్రిటీల నుండి కంపెనీల దాకా యూజర్ల కీలక వ్యక్తిగత డేటాను లీక్ చేశారని అంటున్నారు. ట్విట్టర్ ఐడీలు, ప్రదేశాలు, పేర్లు, లాగిన్ నేమ్స్ లాంటి పబ్లిక్ సమాచారంతో పాటు, ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ అడ్రస్లు, ఇతర ప్రైవేట్ డేటాను హ్యాకర్లు కాజేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది.
గత జులైలోనే 54 లక్షల మందికిపైగా ట్విట్టర్ వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని ఓ హ్యాకర్ 30 వేల డాలర్లకు హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయించడం ప్రారంభించాడని ప్రచారం జరిగింది. దీంతో పాటు మరో API ద్వారా 14 లక్షల ట్విటర్ ప్రొఫైల్స్ని కూడా కాజేశారు. అంతేకాదు… దాదాపు 70 లక్షల ట్విట్టర్ ప్రొఫైళ్లకు సంబంధించిన ప్రైవేట్ సమాచారం లీకైందని బ్లీపింగ్ కంప్యూటర్ బయటపెట్టింది. తాజాగా లీకైన 54 లక్షల మంది యూజర్ల డేటా… ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్ అయిన బ్రీచ్డ్ ఫోరమ్స్ ద్వారా అమ్మకానికి పెట్టారని ఓ హ్యాకర్ తెలిపాడు. సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ అయిన చాడ్ లోడర్ అనే వ్యక్తి… ట్విట్టర్ డేటా లీక్ సమాచారాన్ని ముందుగా ట్విట్టర్లోనే పోస్ట్ చేశాడు. దాంతో… అతని ఖాతాను వెంటనే బ్లాక్ చేశారు. ఆ తర్వాత మరో మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ అయిన మాస్టోడాన్లోనూ డేటా చోరీకి సంబంధించిన సమాచారం కనిపించింది. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన మిలియన్ల కొద్దీ ట్విట్టర్ ఖాతాల డేటా చోరీ అయిందని, ఇది 2021 కంటే ముందే జరిగిందని సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ చాడ్ లోడర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే… ట్విట్టర్ డేటా లీక్ అంశంపై మస్క్ ఇంకా స్పందించలేదు.