WhatsApp New Feature : యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చే వాట్సప్ యాప్… మరో అద్భుతమైన ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పటిదాకా యూజర్లు వాట్సప్ స్టేటస్లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉండగా… త్వరలోనే వాయిస్ నోట్ను కూడా స్టేటస్గా పెట్టుకునే అవకాశం కల్పించబోతోంది. ఈ విషయాన్ని వాట్సప్ అప్డేట్స్ ఇచ్చే బీటా ఇన్ఫో తెలిపింది.
వినియోగదారులు స్టేటస్లో టెక్ట్స్తో పాటు 30 సెకన్ల దాకా వాయిస్ నోట్ను పోస్ట్ చేసుకోవచ్చని బీటా ఇన్ఫో వెల్లడించింది. ఫోన్ కీబోర్డులో టెక్ట్స్ టైప్ చేసే ఐకాన్ కిందిభాగంలో… మైక్రోఫోన్ సింబల్పై క్లిక్ చేస్తే వాయిస్ చెప్పొచ్చని, అదే వాయిస్ను స్టేటస్గా పెట్టుకోవచ్చని వాట్సప్ బీటా ఇన్ఫో చెప్పింది. అంతేకాదు… వాట్సప్ కాల్స్ డెస్క్టాప్ వెర్షన్ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే… యూజర్లు డెస్క్టాప్ యాప్ నుంచి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ యాప్లో కాల్ హిస్టరీ, కాల్స్కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్లో మాత్రమే ఉండగా… త్వరలో వినియోగదారులందరికీ అందాబాటులోకి రానుంది.
మరోవైపు… వాట్సప్ డేటా లీక్ అయిందనే వార్త విని యూజర్లు షాకయ్యారు. దాదాపు 50 కోట్ల మంది యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు సైబర్ న్యూస్ నివేదిక తెలిపింది. వాటిని హ్యాకర్లు ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్లో అమ్మకానికి పెట్టారని చెప్పింది. ఇందులో భారత్, అమెరికా, బ్రిటన్, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్ల ఉన్నాయని వెల్లడించింది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబర్లకు… ఒక్కో ధర నిర్ణయించారని… అమెరికా డేటా అయితే 7 వేల డాలర్లు, యూకే డేటాకు 2500 డాలర్లు, జర్మనీ డేటాకు 2 వేల డాలర్ల ధరను హ్యాకర్లు నిర్ణయించారని తెలిపింది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు వాటిని కొంటే… మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని సైబర్ న్యూస్ నివేదిక హెచ్చరించింది. గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లు వస్తే స్పందించవద్దని వాట్సప్ యూజర్లకు సూచించింది.