Rohit Sharma Reveals Victory Secret: టీ20 ప్రపంచకప్ సూపర్ -8లో సెమీస్లో బెర్తులు ఆసక్తి కరంగా మారాయి. రాత్రి జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చావు దెబ్బ కొట్టింది రోహిత్ సేన. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. రాత్రి మ్యాచ్లో విజయం వెనుక కీలకపాత్ర ముమ్మాటికీ రోహిత్శర్మదే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా గెలుపు వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని ప్రతీ ఆటగాడు ఐపీఎల్ మ్యాచ్లో ఆడినవారే. అందుకే వారి బలాలు, బలహీనతలను చక్కగా అంచనా వేశాడు కెప్టెన్ రోహిత్శర్మ. దీనికితోడు సెయింట్ లూసియా వాతావరణం కూడా ఆటగాళ్లకు కలిసొచ్చింది. మైదానంలో గాలి ప్రభావం తీవ్రంగా ఉండడమే దీనికి మొదటి కారణం. అందుకోసమే షాట్లను బలంగా కొట్టాల్సి వచ్చిందన్నాడు.
ముఖ్యంగా స్టార్ ఆటగాడు కోహ్లి డకౌట్ అయినా దాని ప్రభావం మ్యాచ్పై పడకుండా జాగ్రత్త పడ్డాడు టీమిండియా కెప్టెన్. స్టార్క్ బౌలింగ్లో రోహిత్శర్మ రెచ్చిపోయాడు. గాలిని తమకు అనుకూలంగా మార్చు కునేందుకు ఆసీస్ బౌలర్లు ప్రయత్నించారు. దీంతో బ్యాటింగ్లో మార్పులు చేసినట్టు చెప్పుకొచ్చాడు హిట్మ్యాన్.
Also Read: సిక్సర్ల శర్మగా నయా చరిత్ర.. రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్
ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే గాలి ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేశారు ఆసీస్ ఆటగాళ్లు. గాలికి వ్యతిరేకంగా బంతులు వేయడం మొదలుపెట్టారు. అందుకే తాను ఆఫ్ సైడ్ భారీ షాట్స్ కొట్టాలని ప్లాన్ చేసుకుని మరీ ఆడినట్టు చెప్పాడు రోహిత్శర్మ. ఫీల్డింగ్ సెటప్ను బట్టి షాట్లు ఎంపిక చేసుకున్నానని మనసులోని మాట బయటపెట్టాడు.
మైదానంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చన్నాడు రోహిత్. టీమిండియా బౌలర్లు పరిస్థితులను చక్కగా వినియోగించయుకున్నారని, సరైన సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారని గుర్తు చేశాడు. 200 పరుగులు గట్టి స్కోర్ అయినప్పటికీ, బౌలర్ల కృషి ఎంతో ఉందన్నాడు.
Also Read: సెమీస్కు టీమిండియా.. ఆసీస్పై ఘనవిజయం..
న్యూయార్క్ పిచ్లు పేసర్లకు అనుకూలించాయని, విండీస్లో జరుగుతున్న మ్యాచుల్లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉందన్నాడు రోహిత్. అందుకే కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషిస్తాడని అంచనా వేశామని, అందుకు తగ్గట్టుగానే రాణించాడని తెలిపాడు. భారీ స్కోర్ చేయాలంటే ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించా లని, దీనికితోడు బౌలర్లు కూడా విజృంభిస్తే విజయం తేలికవుతుందన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులోని అందరూ ఆడితేనే విజయం సాధ్యమవుతుందని, తాను నాలుగు షాట్లు కొట్టగానే విజయం సాధించడం కష్టమనే అభిప్రాయాన్ని తనమాటల్లో చెప్పకనే చెప్పాడు.. దటీజ్ రోహిత్శర్మ.