Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లోని రెండవ జ్యోతిర్లింగమైన బాబా మహాకాల్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. భోలేనాథ్ ఆశీస్సులు పొందారు. నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు రాహుల్. సంప్రదాయ దుస్తులు ధోతీ, ఎరుపురంగు అంగవస్త్రం, రుద్రాక్షలు ధరించి పూజలు చేసారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు.
మహాకాల్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన.. తపస్విలు పూజింపబడే దేశం ఇది అని రాహుల్ అన్నారు. తాను గత మూడు నెలలుగా తపస్సు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ జీవితంలో చివరి శ్వాస వరకు కష్టపడే రైతులు, కార్మికులు నిజమైన తపస్విలు అని.. వారి ముందు తాను చేసేది చాలా చిన్నది అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతులెత్తి దేవుడిని పూజిస్తుంది కానీ.. నిజమైన తపస్వీలు అయిన రైతులు, కార్మికులు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, విద్యావంతులైన యువకుల భవిష్యత్తును నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు.