IPL 2022 Final : గత మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం-మొతేరా వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏకంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఆ ఫైనల్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన వాళ్ల సంఖ్య 1,01,566. T20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్కు లక్ష మందికి పైగా ప్రేక్షకులు హాజరు కావడం అదే ఫస్ట్ టైమ్. దీన్నో రికార్డుగా గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్… అందులో ఫైనల్ మ్యాచ్కు చోటు కల్పించింది. ఈ విషయాన్ని అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటించింది… BCCI. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి BCCI కార్యదర్శి జై షా అవార్డు ప్రతిని అందుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణమని… ఈ రికార్డు భారత క్రికెట్ అభిమానులకు అంకితమని.. మొతేరా, IPLకు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విట్టర్లో రాసుకొచ్చింది. నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. అండర్ డాగ్గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఆడిన తొలి లీగ్లోనే ఛాంపియన్గా నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని విజేత అయింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా… 30 బంతుల్లో 34 రన్స్ చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 1982లో నిర్మించిన మొతేరా స్టేడియాన్ని 2021లో పునరుద్ధరించారు. 63 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టేడియాన్ని రూ.800 కోట్ల ఖర్చుతో ఆధునికీకరించారు. దీని పూర్తి సీటింగ్ సామర్థ్యం 1,32,000. అంతకుముందు వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను ఎక్కువ సీటింగ్ ఉన్న స్టేడియంగా పరిగణించే వారు. అందులో 90 వేల మందికి పైగా ఒకేసారి మ్యాచ్ చూసే అవకాశం ఉంది. కానీ… ఆ సామర్థ్యాన్ని మొతేరా అధిగమించింది. ఈ స్టేడియం మొత్తం విస్తీర్ణం 32 సాకర్ ఫీల్డ్లకు సమానం అని చెబుతారు.