Sakini Ramachandraiah Passed Away: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య(65) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరులోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంచుమేళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వాడిగా రామచంద్రయ్యకు గుర్తింపు ఉంది. ఆదివాసీ దేవతలైన సమ్మక్క – సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా రామచంద్రయ్య ప్రపంచానికి చాటి చెప్పారు. అదేవిధంగా మేడారం జాతరలో ప్రధాన ఘట్టమైన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తరలించే సమయంలోనూ రామచంద్రయ్య కీలక పాత్ర పోషించారు. రామచంద్రయ్య మృతిపట్ల ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.
Also Read: ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా ప్రభుత్వం పనిచేస్తుంది: మంత్రి పొంగులేటి
రామచంద్రయ్య ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదనంగా కోటి రూపాయల నజరానాను కూడా ప్రకటించింది. తద్వారా మారుమూల అటవీ ప్రాంతాల్లో ప్రదర్శినలిచ్చే అరుదైన కళాకారుడికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కినట్టయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈయనకు జిల్లా కేంద్రంలో 426 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. అయితే, రామచంద్రయ్యకు నేటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలం అందలేదని స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాలకు రామచంద్రయ్య ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని వారు తెలిపారు.