Amaravati: అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని వైష్ణవిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నియమించారు. రాజధాని నిర్మాణం కోసం ఆమె భారీ విరాళాన్ని ఇచ్చింది. రూ. 25 లక్షల విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసింది. పొలం అమ్మి మరీ ఆ భారీ మొత్తాన్ని అందజేసిన యువతిని సీఎం అభినందించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్లు సీఎం ప్రకటించారు. పోలవరం నిర్మాణం కోసం మరో రూ. లక్ష అందజేసింది. తండ్రితో కలిసి వచ్చి సీఎం చంద్రబాబుకు చెక్కులను అందించింది. భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన వైష్ణవిని చంద్రబాబు ప్రశంసించారు.
ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించింది. రాజధాని కోసం పెద్ద ఎత్తున భూసమీకరణ చేసింది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రణాళికను సైతం సిద్ధం చేసింది అప్పటి ప్రభుత్వం. ప్రణాళికకు తగ్గుట్టుగా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. అయితే, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందకపోవడంతో రాజధాని నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ తరువాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ఆగిపోయినట్లయ్యింది.
అయితే, వైసీపీ మూడు రాజధానుల అంశానికి సంబంధించి చట్టపరమైన అడ్డంకులు రావడంతో ఆంధ్రప్రదేశ్ అటు అమరావతికి కాకుండా, ఇటు మూడు రాజధానులకు కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. అమరావతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రజలు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేసింది. నేటి యువతకు వైష్ణవి స్ఫూర్తిగా నిలుస్తుందంటూ ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు.