YSR: తెలంగాణ మంత్రులు ఛాన్స్ చిక్కినప్పుడల్లా వైఎస్సార్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్య కొన్నాళ్లు బ్రేకులు ఇస్తూ.. మళ్లీ మళ్లీ అవే మాటల మంటలు రాజేస్తున్నారు. గతంలో వైఎస్సార్ దొంగ, జగన్ గజదొంగ అంటూ సంచలన కామెంట్లు చేయగా.. లేటెస్ట్ గా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి రచ్చ రాజేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందన్నారు మంత్రి వేముల. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ను వీడుతానని వైఎస్సార్ సోనియాను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. వైఎస్సార్ వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని.. వారి ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల అరెస్ట్, వైఎస్ విజయమ్మ హౌజ్ అరెస్ట్ పై స్పందిస్తూ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేశారు. పరోక్షంగా వైఎస్ ఫ్యామిలీ అంతా తెలంగాణ ద్రోహులు అనేలా మంత్రి వేముల చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమవుతున్నాయి.
మరోవైపు కల్వకుంట్ల కవిత సైతం కాంగ్రెస్ పై ఘాటు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. ”రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ ను దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి,తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ కు రాహుల్ గాంధీ వెళ్లాడు. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో కాంగ్రెస్ పార్టీ పైనే ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి గెలిచాను” అంటూ కవిత ట్వీట్ చేశారు.