Metro: హైదరాబాద్ మెట్రో రైలు గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా ప్రయాణీకుల ఆదరణ లభిస్తోంది. ప్రతీరోజు సుమారు 4 లక్షలకు పైగానే ప్యాసింజర్లు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన ఈ ఐదేళ్లలో 31 కోట్ల మంది ట్రావెల్ చేశారు.
హైదరాబాద్ మెట్రోను మరింత దూరం పొడిగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 31 కిలో మీటర్ల దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఇక, మెట్రో రెండో దశలో మరో హైలెట్ విషయం ఉంది. అదే, అండర్ గ్రౌండ్ మెట్రో. విమానాశ్రయం సమీపంలో ఏకంగా 2.5 కిలోమీటర్ల దూరం భూగర్భ మెట్రోను నిర్మించనున్నారు.
రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
అమీర్పేట్ మెట్రో స్టేషన్లో హైదరాబాద్ మెట్రో రైల్ ఐదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మేర మెట్రో నడుస్తోందన్నారు.