Minister Komatireddy Venkatreddy: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) విస్తరణకు సంబంధించిన పనులు డిసెంబరులోపే పూర్తయ్యేలా చూస్తామంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. రహదారులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయన్నారు. నల్లగొండ బైపాస్ రోడ్డు గురించి కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ ను కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు కూడా పట్టించుకోలేదన్నారు.
Also Read: వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క
యుటిలిటి ఛార్జీలు భరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టపడలేదన్నారు. ఈ కారణంగా ఆ ప్రాజెక్టు కొంతకాలం ఆగిందని చెప్పారు. యుటిలిటి ఛార్జీలు భరిస్తామని తమ ప్రభుత్వం చెప్పడంతో మళ్లీ కదలిక వచ్చిందన్నారు. ఈసారి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నాగ్పూర్ – మంచిర్యాల హైవే నిర్మాణంపై కూడా కేంద్రంతో చర్చించామన్నారు. విజయవాడ – హైదరాబాద్ హైవేను డెత్ రోడ్డు అని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారని, ఎన్హెచ్-65పై 17 బ్లాక్ స్పాట్ లను గుర్తించి మరమ్మతులు చేపట్టామన్నారు. విజయవాడ – హైదరాబాద్ హైవేను ఆరు లేన్లుగా మార్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. డిసెంబరులోపే ఎన్హెచ్ – 65 విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామంటూ మంత్రి పేర్కొన్నారు.