8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. జీతాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా లేఖ రాశారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, వేతనాలు, అలెవెన్స్ ల సవరణలపై ప్రభుత్వం దృష్టి సారించాలంటూ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి మిశ్రా లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశమున్నట్లు చర్చ కొనసాగుతున్నది.
8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటై సిఫార్సులు ఆమోదించబడితే దాదాపుగా 49 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనున్నది. అదేవిధంగా 68 లక్షల మంది పెన్షనర్లకు కూడా లాభం చేకూరనున్నది.
అయితే, పే కమిషన్ సాధారణంగా 10 సంవత్సరాల విరామం తరువాత అమలు చేయబడుతుంది. అప్పుడున్న పరిస్థితులకు అనుగూణంగా వాటిని సవరిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సులు 2016లో ఆమోదించబడింది. తదుపరి వేతన సంఘం సిఫార్సులు 2026లో అమలులోకి రానున్నది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, దాని సిఫార్సులను సమర్పించడానికి ఒక సంవత్సరం లేదా 18 నెలల సమయం పడుతుంది. ఆ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించి పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 2026లో ఇది అమలులోకి వచ్చే అవకాశముందంటూ పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. సాధారణంగా ఉద్యోగుల జీతాల పెంపు విషయం వేతన సంఘం సిఫార్సు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 8వ వేతన సంఘం సిఫారసుల కోసం ఏర్పాటు చేసినట్లయితే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు సెట్ చేయబడే అవకాశముంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్ జీతం రూ. 18 వేలుగా ఉన్నందున, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెడితే వారి బేసిక్ పేలో రూ. 8 వేల నుంచి రూ. 26 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
Also Read: రాజకీయాల్లోకి బిహార్ సీఎం కుమారుడి ఎంట్రీ ఖాయమైనట్లేనా?
కాగా, ఉద్యోగుల జీతం మరియు పెన్షనరీ ప్రయోజనాలపై 5వ సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) సిఫారసుల అమలు కోసం 19 నెలల సమయం పట్టింది. 6వ సీపీసీ అమలు కోసం 32 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. అయితే, 7వ సీపీసీ సిఫారసులు గడువు తేది నుంచి 6 నెలల లోపు అమలు చేయబడుతున్నాయి. ఈ సిఫారసులకు జూన్ 2016లో అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. చూడాలి మరి.. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అనేది.