Nitish Kumar Son Politics Entry: బిహార్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు నితీష్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ చాలా తక్కువ సందర్భాల్లో తన తండ్రితో బహిరంగంగా కనిపిస్తారు. అయినప్పటికీ నితీష్ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇందుకు జేడీయూ నేత చేసిన ట్వీట్ కూడా ఓ కారణం అని అంతా భావిస్తున్నారు.
యువ నాయకత్వం అవసరం:
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీహార్కు యువ నాయకత్వం అవసరమని రాష్ట్ర ఆహార కమిషన్ చీఫ్ విద్యానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా నిశాంత్ కుమార్లో రాజకీయాలకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంది జేడీయూ నేతలు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలంటూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను తాను కూడా ఏకీభవిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో నితీష్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కుమారుడు రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలను జేడీయూ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఖండించారు. అవన్నీ నిరాధారమైన వార్తలుగా పేర్కొన్నారు. చాలా సున్నితమైన ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవద్దని కోరారు. నిశాంత్ రాజకీయాల్లోకి వస్తారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. ఇటువంటి ఊహాగానాలు ప్రజల మనసుల్లో సందేహాలను కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: డైలమాకు ఎండ్ కార్డ్.. వయనాడ్ కు రాహుల్ గాంధీ రాజీనామా
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జేడీయూ జూన్ నెలాఖరులో ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ కార్యచరణ ప్రకారం జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్ణీత వ్యవధిలోనే జరగాల్సి ఉంది. కానీ ఈసారి కాస్త ఆలస్యం అయ్యింది. జూన్ నెల ప్రారంభంలో కార్యవర్గ సమావేశాలు జరగాల్సి ఉంది. రాజకీయ పరిస్థితుల వల్ల జూన్ నెలాఖరులో జరుగనున్న ఈ సమావేశంలో జేడీయూ ఎటువంటి ప్రధాన నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్దంగా లేదని జేడీయూ నేత ఒకరు మీడియాతో తెలిపారు.