Sharmila: ఆమెతో ఏమి అవుతుందిలే అనుకున్నారు. ఆమె అసలు తెలంగాణనే కాదన్నారు. జగన్ తో గొడవ వల్లే ఇక్కడికి వచ్చిందన్నారు. ఎవరో వదిలిన బాణమని ఇప్పటికీ అంటున్నారు. ప్రైవేట్ ఈవెంట్ లా పార్టీని ప్రారంభించారని విమర్శించారు. దిగ్గజాల్లాంటి మూడు పార్టీల మధ్య షర్మిల నిలదొక్కుకోలేరని పెదవి విరిచారు. ఆమె ఎన్ని ఘాటు విమర్శలు చేస్తున్నా.. కనీసం కౌంటర్ కూడా ఇవ్వకుండా ప్రధాన పార్టీలు లైట్ తీసుకున్నాయి. మీడియాలో పెయిడ్ ప్రమోషన్ ఇస్తున్నారని అన్నారు. కానీ, వైఎస్ షర్మిల ఇవేమీ పట్టించుకోలేదు. ఫలితం ఆశించకుండా తన రాజకీయమేదో చేసుకుపోతున్నారు. ఏదో ఒకరోజు తన ఉనికి బలంగా చాటుకునే రోజు వస్తుందని భావించారు.
ఆ రోజు రానే వచ్చింది. తన తడాఖా చూపించారు షర్మిల. కరుడుగట్టిన నేతలకు ధీటుగా రాజకీయం నెరిపారు. జగనన్నలానే గట్టి పిండమేనని ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడో మారుమూల ఏరియాలో తన ఫ్లెక్సీలను తగలబెడితే.. హైదరాబాద్ లో అగ్గి రాజుకునేలా చేశారంటే మామూలు విషయం కాదు. రెండు రోజుల పాటు షర్మిల గురించే టీవీల్లో నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ లు నడిచాయంటే.. రాజకీయంగా ఆమెకు అంతకంటే విజయం ఇంకేం ఉంటుంది. తెలంగాణ ప్రజలంతా తన న్యూసే చూసేలా.. అటెన్షన్ క్రియేట్ చేయగలిగారు. ఇన్ని నెలలుగా రాజకీయం చేస్తున్నా.. 3,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినా.. ప్రతీరోజూ నేతలను తిడుతున్నా.. రాని కవరేజ్ ఒక్క ఎపిసోడ్ తో వచ్చేసింది. దటీజ్ షర్మిల అనిపించుకుంది.
నర్సంపేట నియోజకవర్గంలో గొడవ జరిగితే.. షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు పోలీసులు. మామూలుగా అయితే అక్కడితో ఆగిపోయేది విషయం. మర్నాడు మళ్లీ మౌనంగా పాదయాత్ర ప్రారంభించేవారు. కానీ, షర్మిల అలాకాదు. తనపైనే దాడి చేసి, తననే అరెస్ట్ చేస్తారా అంటూ.. టీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేసిన కారులోనే నేరుగా ప్రగతి భవన్ కు బయలు దేరడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. పోలీసులు ముందే గెస్ చేసి ఉంటే, ఆమెను ఇంటి దగ్గరే ఆపేసి ఉండేవారు. ఆ..షర్మిలనే కదా ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకున్నట్టున్నారు. అందుకే ఖాకీలకు, సర్కారుకు షాక్ ఇచ్చేలా దూకుడుగా పావులు కదిపారు. పోలీసులు అడ్డగించినా.. కారు డోర్లు లాక్ చేసుకొని.. లోపలే ఉండిపోవడం మరో హైలెట్ అంశం. పోలీసులు చేసేది లేక, కారుతో సహా షర్మిలను లిఫ్ట్ చేసి స్టేషన్ కు తరలించడం.. ఆ విజువల్స్ వైరల్ గా మారడంతో షర్మిలకు ఫుల్ హైప్ వచ్చింది.
అంతా షర్మిల అనుకున్నట్టే జరిగింది. ఆమె విసిరిన పొలిటికల్ ట్రాప్ కి పోలీసులు చిక్కారు. రాజకీయం రక్తి కట్టింది. ఇదే సమయంలో సెంటిమెంట్ అస్త్రాన్ని సైతం ప్రయోగించారు. తల్లి విజయమ్మ ఇంటి దగ్గర దీక్ష చేసేలా చేశారు. అలా అలా పరిస్థితి అంతా తనకు అనుకూలంగా మారిపోయేలా చేయగలిగారు. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజకీయంగా ఉద్రిక్తత రాజేశారు. ఇదే దూకుడు ఎలక్షన్ల వరకూ కంటిన్యూ అయితే.. వైఎస్సార్ టీపీ సైతం అసెంబ్లీ బరిలో బలమైన పోటీదారుగా మారే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు.