YS Sharmila : YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీఆర్ఎస్ నేతల దాడిలో ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నించారు. రాజ్భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అతి కష్టం మీద కారు డోర్లు తెరిచి షర్మిలను పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారు. వీఐపీ రాహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో షర్మిలపై కేసు నమోదైంది. 333, 353, 337 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఎస్కు షర్మిల అనుచరులు, YSRTP కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు భవనంపైకి ఎక్కి న్యాయం కావాలంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిలా తయారైందన్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
విజయమ్మ హౌస్ అరెస్ట్..
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను కలిసేందుకు విజయమ్మ లోటస్ పాండ్ లోని నివాసం నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. విజయమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సమయంలో పోలీసుల తీరును విజయమ్మ ప్రశ్నించారు. తన కూతురును చూడటానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. తనను ఆపితే ఇంట్లో నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
బ్రదర్ అనిల్ రియాక్షన్
షర్మిలతో మాట్లాడేందుకు ఆమె భర్త అనిల్ కుమార్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పాదయాత్ర చేయడం తప్పా అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు.
వైఎస్ఆర్ సీపీ స్పందన ఇదే
వైఎస్ షర్మిలను అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్ సీపీ ఖండించింది. అయితే షర్మిల రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం తాము కలుగజేసుకోమని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
వివాద నేపథ్యం ఇదే
షర్మిల ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు. తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని.. పాదయాత్రను నిలిపివేయాలని షర్మిలను నర్సంపేట ఏసీపీ సంపత్రావు కోరగా ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో శంకరాంతండా సమీపంలో నిలిపిన షర్మిల కార్వాన్పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. అనంతరం షర్మిలను హైదరాబాద్ కు పోలీసులు తరలించారు.
పాదయాత్రకు హైకోర్టు అనుమతి
షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మత, రాజకీయాంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని షరతు విధించింది. వైఎస్ఆర్ టీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.