Minister Seethakka: ఆర్టీసీ బస్సులో మంత్రి సీతక్క మరోసారి ప్రయాణం చేశారు. ఏటూరునాగారం నుంచి మంగపేట మండలం నర్సింహసాగర్ కు వెళ్లే ఆర్టీసీ బస్సును ఆమె మంగళవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ తో కలిసి ఆ బస్సులో ప్రయాణించారు. కండక్టర్ ఆమెకు జీరో టికెట్ ను అందజేశారు.
ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు, ములుగు బస్టాండ్ ను మోడల్ బస్టాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి నర్సింహసాగర్ కు వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించి, అందులో ప్రయాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మంత్రితోపాటు బస్సులో ప్రయాణించారు.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ పథకానికి సంబంధించిన ఫైల్ పై ఆయన సంతకం చేసి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకాన్ని డిసెంబర్ 9న ప్రారంభించారు.
మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు కొన్ని కండీషన్లు పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఈ ఉచిత బస్సు సదుపాయం ఉంటుందని తెలిపారు. బస్సు కండక్టర్ కు గుర్తింపు కార్డు చూపించి సదరు మహిళలు జీరో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో అందుబాటులోకి తెచ్చారు. అయితే, ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలకు జీరో టికెట్ అందజేస్తున్నారు. జీరో టికెట్ లేని యెడల వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు.
ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణించి… ఈ పథకం వివరాలను తెలియజేస్తూ ప్రజల ఉద్దేశాలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణం చేసి, ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్ను కాపాడుకోగలమా..? : కోదండరాం
కాగా, ఈ పథకం పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఈ పథకానికి సంబంధించి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అక్కడ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని అమలు చేసింది. ఆ తరువాత జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే కర్ణాటక మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి కూడా హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని ఏపీలో అమలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలు ఫ్రీ బస్సు పథకం అమలు విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.