Update on Telangana Phone Tapping Case: నాలుగు రోజులు హడావుడి.. ఆ తర్వాత అంతా హంభూష్. చాలా కేసుల్లో ఇదే కనిపిస్తుంది మనకు. బట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం అలా జరగడం లేదు. అసలు నిందితులను పట్టుకునేవరకు తగ్గేదే లేదంటున్నారు తెలంగాణ ఖాకీలు. ప్రజల శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన తమ డిపార్ట్మెంట్లోనే ఇంటి దొంగలుఉన్నారని తెలిసి ఈగో హర్డ్ అయ్యిందో ఏమో తెలీదు కానీ.. ఈ కేసు అంతు తేల్చే వరకు తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడిలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది కాబట్టి.
వందలాది మంది నేతలు. అందులో విపక్ష పార్టీవారే కాదు.. సొంతపార్టీ నేతలు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలా ఎవ్వరిని వదలకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు విచారించారు. కీలక విషయాలు తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్నవారిని కూడా రప్పించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా చానల్ అధిపతి శ్రావణ్రావును కూడా ఇండియాకు తిరిగి తీసుకొచ్చే పనులు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ విచారణలో నిందితులు చెప్పిన విషయాలు.. కానీ ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చేయాలంటే ఆధారాలు కావాలి. ఇప్పుడీ ఆధారాల సేకరణపై ఫోకస్ చేశారు పోలీసులు. కొంత సక్సెస్ కూడా అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేస్కు సంబంధించి కీలకమైన టెక్నికల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. విచారణలో తెలుసుకున్న విషయాలకు అనుగుణంగా.. కొండాపూర్ కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి 3 సర్వర్లు.. హార్డ్ డిస్క్లు.. 5 మాక్ మినీ డివైజ్లను సీజ్ చేశారు. అంతేకాదు ఆ సంస్థ డైరెక్టర్ రవికుమార్ను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడానికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలను సేకరించారు. అంతేకాదు రవికుమార్ నుంచి 160 CRPC కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదే సంస్థలో పనిచేసే మేనేజర్ అనంత చారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారం, శ్రీనివాస్ల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అక్కడ సీజ్ చేసిన పరికరాలను ఫోరెన్సిక్ అనాలసిస్ కోసం పంపించారు.
Also Read: ట్యాంపింగ్ కేసులో కీలక ఆధారాలు లభ్యం.. మరింత వేగం పెంచిన అధికారులు
సో ఈ కేసులో మరో స్టెప్ ముందుకు పడ్డట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం కొన్ని స్టేట్మెంట్స్తోనే దర్యాప్తును పూర్తి చేయలేరు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలు చేసిన వారికి కోర్టులో శిక్ష పడాలంటే ఆధారాలు కావాలి. ట్యాపింగ్ చేశారు సరే.. ఎలా చేశారు? దీనికి సంబంధించిన టెక్నాలజీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? దానికి సహాయం చేసిన వారు ఎవరు? ఎప్పుడెప్పుడు చేశారు? ఎలా చేశారు? ఇలా ప్రతి ప్రశ్నకు కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే టెక్నికల్ అంశాలపై కంప్లీట్గా ఫోకస్ చేసింది ఇన్వెస్టిగేషన్ టీమ్.
ఇక్కడో విషయం కూడా క్లారిఫై అయిపోయింది. అదేంటంటే.. ఈ ట్యాపింగ్ కోసం బయటి నుంచి హెల్ప్ తీసుకున్నారు. అయితే ఇది కూడా అనధికారికంగా నే జరిగింది. ఎందుకంటే అధికారికంగా జరిగితే ఈ సోదాలు చేయడం.. సీజ్ చేయడం ఎప్పుడో జరిగేవి. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా సోదాలు చేశారంటే అనఫిషియల్ అని తేలిపోతుంది. మరి వారు ఫ్రీగా అయితే సేవలందించరు. సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే భారీగానే చార్జ్ చేస్తాయి. మరి ఆ చెల్లింపులు చేసిన పెద్దలు ఎవరు? లేదంటే ఏ నేతకు చెందిన కంపెనీలు ఇవీ.. ? వీటి వెనకున్నది ఎవరు? అసలు వారి వద్ద నుంచి ఇలాంటి టెక్నికల్ సాయం తీసుకోవాలని ఆదేశించింది ఎవరు? దీని వెనక బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారా? లేక ఆయా కంపెనీలను కూడా బెదిరించి వారి సేవలను ఉపయోగించుకున్నారా? ఈ ప్రశ్నలకు ముందు ముందు సమాధానం తెలియనుంది.
Also Read: Rahul Gandhi’s 54th Birthday: రాహుల్ గాంధీ బర్త్ డే.. విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
కానీ ఒక విషయం మాత్రం నిజం.. పోలీస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి మొదలుపెడితే డీజీ ర్యాంక్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. బయటి నుంచి చూస్తే మీడియా సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీల హస్తం కూడా ఉంది. అయితే ఈ రెండు వ్యవస్థలను మేనేజ్ చేసిన ఆ పెద్దలు ఎవరు? అనేది కూడా తేలాలి.
ఇప్పటికే నిందితుల నోటి నుంచి బీఆర్ఎస్ సుప్రిమో.. పెద్దాయన.. అనే పదం వచ్చేసింది. అంటే ఇన్డైరెక్ట్గా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు వచ్చేసింది. సో ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలిపోయింది. అయితే దీనిని ఎస్టాబ్లిష్ చేసే పనిలో పోలీసులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.