CM Revanth Reddy congratulates RTC Female staff: కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్)గా వారిని సీఎం అభినందించారు.
‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందిచడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్టర్(ఎక్స్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, ఊరెళ్దామని కరీంనగర్ ఆర్టీసీ బస్టేషన్ కు వచ్చిన ఓ గర్భిణీకి అక్కడే నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.
ఒడిశాకు చెందిన వలస కూలీ అయిన కుమారి ఆమె భర్తతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నల్లి ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉంది. ఆదివారం సాయంత్రం కుంట వెళ్దామని కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు. కుమారి నిండు గర్భిణీ. బస్ స్టేషన్ కు వచ్చిన కుమారికి అక్కడే నొప్పులు రావడం మొదలయ్యాయి. వెంటనే గర్భిణీ భర్త ఆమెను పక్కన పడుకోబెట్టి సాయం కోసం ఆర్టీసీ అధికారులకు విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు 108కి సమాచారం ఇచ్చారు.
Also Read: మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం.. హరీశ్రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
ఈలోగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్లు ముందుకు వచ్చారు. చీరలను అడ్డంపెట్టి సాధారణ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. గర్భవతికి అండగా నిలిచిన ఆర్టీసీ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పత్రికల్లో వార్తా కథనం వచ్చింది. ఇది చూసిన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, అభినందనలు తెలిపారు.